కొనసాగుతున్న కాచవరం గ్రామస్తుల ఆందోళన
కారంపూడి.
ఆగస్టు 28
రాజధాని వాయిస్ :
కారంపూడి మండల పరిధిలోని శ్రీ సిమెంట్ మైనింగ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాచవరం గ్రామస్తులు గత ఐదు రోజులుగా చేపట్టిన నిరసన మరింత ఉధృతమైంది.
మైనింగ్లో జరిగే భారీ పేలుళ్ల కారణంగా తమ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని వారు వాపోయారు.
రెండు రోజుల క్రితం గురజాల ఆర్డీవో మురళి, డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, అప్పటివరకు పనులు నిలిపివేయాలని సూచించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
అయితే పనులు తిరిగి కొనసాగడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలతో సహా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మైనింగ్ వద్ద నిరసనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ విషయమై యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది.
0 Comments