నరసరావుపేట. ఆగస్టు 28
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశించారు. గురువారం నరసరావుపేట కలెక్టరేట్కు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, కమిషన్ సభ్యులు మేకల బిక్షంలకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, డీఆర్వో అద్దయ్య మొక్కలు అందించి సాదర స్వాగతం పలికారు. తదుపరి కలెక్టరేట్లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు, జై భీమ్, బీఎస్పీ తదితర దళిత సంఘాల ప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలను స్వీకరించారు. అందిన వినతులపై అధికారులు వెంటనే స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని చైర్మన్ స్పష్టం చేశారు.
ఇదే సమావేశంలో గుంటూరుకు చెందిన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రచురించిన "షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం–1989 అనుసరించి సహాయ పునరావాస పరిహారానికి ధన సహాయం - నిబంధనలు" అనే బుక్లెట్ను కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, కమిషన్ సభ్యులు మేకల బిక్షం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాబాయి, డీఆర్వో అద్దయ్య, దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.
0 Comments