Friday, 28 August 2026
Telugu Daily
Header
BREAKING

పేదరిక నిర్మూలనకు ‘పీ-4’ గొప్ప సామాజిక ఉద్యమం

-  గుంటూరు పశ్చిమంలో 19 వేల బంగారు కుటుంబాల గుర్తింపు
-  ఎమ్మెల్యే గళ్ళా మాధవి


గుంటూరు.ఆగస్టు 28 రాజధాని వాయిస్ :పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేసిన ‘పీ-4’ కార్యక్రమం ఒక గొప్ప నైతిక, సామాజిక ఉద్యమమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ‘విజన్ యాక్షన్ యూనిట్స్ & పీ-4’ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమె, నియోజకవర్గంలో అమలవుతున్న పీ-4 ప్రగతి నివేదికను సమర్పించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉన్నతమైన భావనతో రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజా భాగస్వామ్యం పెరిగి, వేలాది నిరుపేద కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు సాధ్యమవుతోందని వివరించారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు 19,000 ‘బంగారు కుటుంబాల’ను గుర్తించామని, అందులో 11,800 కుటుంబాలకు 147 మంది మార్గదర్శకులను అనుసంధానం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన సుమారు 7,000 కుటుంబాలకు కూడా రాబోయే ఏడాది కాలంలో మార్గదర్శకులను కేటాయించి, పీ-4 పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్టం చేశారు. కుటుంబాలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావడంలో ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం అనే మూడు అంశాలు కీలకమని, ఈ క్రమంలో పలు ఆసుపత్రుల సహకారంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
వివిధ సంస్థలు, పరిశ్రమలు, దాతల భాగస్వామ్యంతో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని, విద్యార్థులకు ఫీజుల సాయంతో పాటు స్వయం ఉపాధి కోసం రుణాలు, పుష్‌కార్టులు అందజేస్తున్నట్లు వివరించారు. సామాన్య కుటుంబాలపై అత్యధిక భారం మోపేది గృహ వసతేనని, ప్రభుత్వం ద్వారా సొంతింటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తే నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయని సీఎం దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని ప్రతి బంగారు కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని గళ్ళా మాధవి వెల్లడించారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!